Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : గత వైసీపీ ప్రభుత్వం అవలంభించిన ఆర్థిక దోపిడీ వల్ల రాష్ట్రానికి రూ. 76,795 కోట్ల ఆదాయం తగ్గిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేయడంతో పెట్టుబడులు తగ్గిపోయాయని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశంలో శుక్రవారం గత ప్రభుత్వ ఆర్థిక అవకతవలకపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019-24 మధ్య రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిందని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను సైతం మళ్లించారని దుయ్యబట్టారు. డ్వాక్రా మహిళల నిధులను కొట్టేశారు. పంచాయతీలకు వెళ్లాల్సిన నిధులను దారి మళ్లించారు. ప్రభుత్వ ఆస్తులను, విశాఖలో ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టారని విమర్శించారు.పోలవరం పూర్తయి ఉంటే ఏపీకి రూ. 45 వేల కోట్ల ఆదాయం వచ్చేదని వివరించారు. ఇసుక అక్రమాల ద్వారా రాష్ట్రానికి రూ. 7 వేల కోట్లు , గనుల దోపిడీ ద్వారా రాష్ట్రానికి రూ.9,750 కోట్ల మేర నష్టం జరిగిందని అన్నారు. రాజధాని అమరావతిని కొనసాగించి ఉంటే విశ్వనగరంగా అభివృద్ధి చెందేదని, రూ. 3లక్షల కోట్ల ఆస్తి , 7 లక్షల ఉద్యోగాలు వచ్చేవని బాబు పేర్కొన్నారు.ఏపీకి ఆదాయ వనరులు భారీగా తగ్గాయని, వృద్ధిరేటు 13.5 నుంచి 9. 5 శాతానికి పడిపోయిందని వెల్లడించారు. 2014-19 టీడీపీ హయాంలో రాష్ట్రాభివృద్ధి కోసం కొత్త పోర్టులు ప్రారంభించామని వివరించారు. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉండడం కలిసి వచ్చే అంశమని అన్నారు. కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Reporter
Telugu Rekha Media