Telugu Rekha Media - తెలంగాణ / భూపాలపల్లి : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి జిల్లా అధికారులు అత్యంత ప్రాధాన్యత నివ్వాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్య పరిష్కారం కోరుతూ ప్రజలు ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ప్రజావాణి నుండి కూడా జిల్లాకు సంబంధించి నటువంటి దరఖాస్తులు రావడం జరుగుతుందని అట్టి దరఖాస్తులు వారం రోజుల్లో పరిష్కరించి ప్రజావాణి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులు సత్వర పరిష్కారానికి అన్ని శాఖల అధికారులు వారి వారి కార్యాలయ పరిధిలో ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించుకోవాలని ఆదేశించారు. సమస్య పరిష్కారానికి అందచేసిన దరఖాస్తుదారునికి సమస్య పరిష్కార స్వభావంపై లిఖితపూర్వకంగా సమాచారం అందించాలని ఆయన పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం చాలా ముఖ్యమైనదని అన్ని శాఖల అధికారులు నిర్దేశిత సమయానికి హాజరు కావాలని తెలిపారు. అధికారులు సమయపాలన పాటించాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి ప్రజావాణి నుండి మన జిల్లాకు 135 ఫిర్యాదులు సిఫారసు చేసారని రానున్న వారంలో పరిష్కరించాలని పెండింగ్ ఉంచొద్దని అధికారు లను ఆదేశించారు. ఈ సమావేశంలో కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media